శ్రీ కందాళ సుబ్రహ్మణ్య తిలక్ స్మృతి
నేను 1986 లో నా కవితా సంకలనం " యుద్ధోన్ముఖంగా " పుస్తకపరిచయ సభ పెట్టేను . చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ లో ! ఆరోజున ఆ పుస్తకం విడుదల ని కందాళ తిలక్ గారు చేయాల్సి ఉంది . అందువలన మీరు ఆ పత్రాన్ని కలిగి ఉన్నవారైతే , గమనిస్తే గనక దాన్ని , ఆ ఆహ్వానపత్రం లో కూడా తిలక్ గారి పేరే ఉంటుంది . పుస్తక ఆవిష్కర్త శ్రీ కేఎస్ తిలక్ అని . సభాధ్యక్షత కాళోజీ వహించవలసి ఉంది . చేకూరి రామారావు తదితరులు వక్తలూనూ !
ఒకసారి నేను ఆడియెన్స్ వేపు చూశాను . ఒక పెద్దాయన పంచె కట్టుతో అక్కడ కూర్చుని ఉన్నారు అందరికన్నా ముందుగా వచ్చి . నేనా ఎనభైలో సాహిత్య రంగ ప్రవేశం చేసినా నా చదువు కారణంగానూ --- నా మనస్తత్వం కారణం గాను ఎక్కువగా ఎవరినీ కలిసిన దాన్నిగాను . సాహిత్యరంగానా అంతే ! పేర్ల ద్వారా కవులు - కథకులూ పరిచయం ఉన్నా -- ఎవరివీ ముఖపరిచయాలు నాకు ఆనాడు ఈనాడు కూడా అంతగాలేవు . పైగా అప్పటికింకా తెలుగు సాహిత్యానికి నేను కూడా కొత్తదానినే ! దాశరధి రాసిన ముందుమాట ఒక్కటే ఆనాటికి నా సాహిత్య రంగ ప్రవేశానికి ఆమోద పత్రం ! :) అలాగే ఈ హైద్రాబాద్ వూరు సైతం నాకు ఆనాటికి బాగా తెలుసును అనీ చెప్పలేను కూడా ! నా ప్రపంచం అంతా ఉస్మానియా యూనివర్సిటీ . నా సహా విద్యార్థులూ .. ఇంకా కొందరు అక్కడి మిత్రులు . ఆ యూనివర్సిటీ రాజకీయాలూ ! ఇవే ! సాహిత్యంలోని వ్యక్తుల చిరునామాలు సైతం ఇంకా నాకు తెలియని కాలం అది . దాశరధి , నారాయణ రెడ్డి , ఇంకా నా సమకాలపు కుర్రకవులు కొందరు , ఇంతే ఆనాటికి నా పరిచయాల పరిధి ! పేరుకి నేను ఉత్తరాంధ్రా అమ్మాయినే కానీ ఉత్తరాంధ్రలో కూడా ఆనాటికి నేను అంతగా తెలిసే వీలు లేదు . ఎందుకంటే నాకు సాన్నిహిత్యం ఎక్కువగా తెలంగాణా తోనే !
అందువలన నేను ఆ పెద్దాయనని గుర్తుపట్టలేదు . చూసి చూసి ఆయనే నన్ను పిలిచారు . తిలక్ గారు ఏరీ ? అని అడగడానికి అని . అందువలన నాకు ఆయన తిలక్ గారి కోసం వచ్చిన పెద్దమనిషి అని మాత్రమే అర్ధం అయ్యింది . ఇంకా రాలేదండీ అని ఆయనకి జవాబు ఇచ్చేను . తరవాత కుదరక ఎదో పనిబడి మా తిలక్ గారు నా పుస్తకావిష్కరణకి రాలేదు . అందువలన సభకి అధ్యక్షత వహించడానికి వచ్చిన కాళోజీ నే ఆరోజు నా " యుద్ధోన్ముఖంగా "పుస్తక ఆవిష్కరణ కూడా చేశారు . అలా ఎనభైలతో మొదలుపెట్టి ఆయన పోయేదాకా కాళోజీ నాకు సన్నిహితులు గానే మిగిలారు . ఆవేళ వచ్చిన వాళ్లంతా ఆ ఆడియెన్స్ లో కూర్చున్న పెద్దాయనని వచ్చి పలకరించి వెడుతున్నారు . అందువలన నాకు కుతూహలంకలిగి ఎవరినో అడిగాను "ఆయన ఎవరూ ? " అని . వాళ్ళు ఆశ్చర్యంగా నీకు తెలియదా ? ఆయన "చాసో " కదా ! అన్నారు . నేను పేరు వినడమే తప్ప నిజానికి చాసో [ ప్రముఖ కథా రచయిత చాగంటి సోమయాజులు , మా ఉత్తరాంధ్రా అభ్యుదయ రచయితలలో అగ్రగణ్యులు ] కధలని వేటినీ అప్పటికి చదివింది లేదు . ఆ తరవాత కూడా నేను ఆయన కధల్ని చదివింది తక్కువే ! " కుంకుడాకు " కధ కాక నా అభిరుచికి ఆయన కధలు నప్పలేదని ఎందుకో గుర్తు . అలా చాసో నాకు రచయితగా కూడా సన్నిహితం కాలేదసలు ! . అయితే చాసో నాకోసం కాక ఆవేళ సాయంత్రం కందాళ తిలక్ గారి కోసం అని వచ్చారు :) రాజకీయాలు కాక తిలక్ గారికి సాహిత్యంతో ఏమీ అనుబంధం లేదు . నా రచనలని మాత్రం చదివి మెచ్చుకునేవారు తిలక్ గారు .
ఇదివరకూ కూడా ఒకసారి నేను ద్రావిడ బ్రాహ్మలని గురించి వివరించి ఉన్నాను . నేను ద్రావిడ బ్రాహ్మల వర్గానికి చెందిన అమ్మాయిని . ద్రావిడ బ్రాహ్మల వర్గం నించి ఇతర వచ్చిన ప్రముఖ కవులు రచయితలూ , విప్లవ సంఘాల నేతలూ సోషలిస్టు నాయకులూ కూడా బాగానే ఉన్నారు . తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన ఆదిభట్ల నారాయణదాసు , అలాగే చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రీ , శ్రీశ్రీ , శ్రీరంగం నారాయణ బాబు , ఆరుద్ర , వీరంతా విజయనగరం జిల్లావారే ! ద్రావిడ బ్రాహ్మణ వర్గం వారే ! పేరీ సుబ్బరాయ శాస్త్రీ , పేరీ కాశీనాధ శాస్త్రీ [ ప్రముఖ సంస్కృత పండితులు పూసపాటి రాజావారి ఆస్థానాన ] , పేరి కాశీనాధ శాస్త్రి గారికి స్వయానా అల్లుడైన శ్రీ తాతా రాయుడు శాస్త్రీ , సంస్కృతంలో గొప్ప వ్యాకరణవేత్త , ఆ తరంవారే అయిన శ్రీ పేరి సూర్యనారాయణ శాస్త్రీ వ్యాకరణ పండితులే ! ఇలా చాలా మంది ! ఆదిభట్ల నారాయణ దాసుగారి తరం వారు అందరూ ఆనాటి పూసపాటి రాజుగారి కొలువులో ఉన్నవారే ! వీరిని పోషించిన ఆనంద గజపతి రాజుగారికి కూడా సంస్కృతం బాగావచ్చు . అసలు విజయనగరం జమీందారులు ముందునించీ కూడా కాశీ లోని సంస్కృత విద్యాసంస్థలకు ఎన్నో భూరి విరాళాలని ఇచ్చిన వారు . కాశీలో మా రాజుగారికి చెందిన బంగ్లా ఉండేది . అక్కడికి వెళ్లి బ్రాహ్మణ వర్గాలవారు సంస్కృతం చదువుకుందికి వలసిన వసతులు కూడా ఉండేవి . . దువ్వూరి సుబ్రహ్మణ్య శాస్త్రిగారి ఆత్మకథ చదివితే , ఆనాటి వీరందరి ప్రస్తావన విపులంగా వస్తుంది . చదవండి అందరు ఆ పుస్తకాన్ని . చదవడానికి చాలా ఆసక్తిగా ఉండే పుస్తకం అది . బాగుంటుంది ఆ పుస్తకం . తాతా రాయుడు శాస్త్రి గారికి స్వయానా శిష్యులు మరి దువ్వూరి వెంకటరమణ శాస్త్రుల వారు .
అలాగే ఇంక రాజకీయాలని చూస్తే -- విప్లవకవులు , విప్లవ సంస్థల్ని తమ కార్యకలాపాలతో నాయకత్వంతో ఉద్దీపనం చేసినవారు కవులలో శ్రీశ్రీ ఎలాగో విప్లవ రాజకీయాలలో ఆదిభట్ల కైలాసం [ పార్వతీపురం లో ఆ తరవాత వెంపటాపు సత్యం మాస్టారితో కలిపి పోలీసుకాల్పులలో మరణించినవారు ] నక్సలైట్ ఉద్యమ నాయకులు ద్రావిడులే . అలాగే ఇటీవల ప్రకాశం జిల్లాలో హత్యకావింపబడిన మావోయిస్టు పార్టీ నేత గంటి ప్రసాద్ దాకా కూడా ఈ ద్రావిడ బ్రాహ్మణ వర్గం నించి వచ్చిన వారే !
వీరిలాగానే నిన్న తన 98 వ ఏట వైజాగ్ లో కన్నుమూసిన మాజీ ఎంపీ కందాళ సుబ్రహ్మణ్య తిలక్ గారు కూడానూ ! తిలక్ గారు మనసా వాచా లోహియా సోషలిస్టు . ఆయన సైతం పూసపాటి జమీందారులకి దగ్గరి వారే ! గురజాడ అప్పారావు గారు ఎలా దగ్గరో అలా ! రాజుగారు [ పీవీజీ రాజు గారు ] తిలక్ గారి కాలంలో ఉన్న విజయనగరపు జమీందారు . పీవీజీ రాజుగారు కూడా దేశ రాజకీయాలలో చురుకైన పాత్ర పోషించిన వ్యక్తి . ఆయన జీవితకాలం సోషలిస్టు గా బతికిన వారు . పూసపాటి జమీందారులు ముందునించి ఆధునిక విద్యని అభివృద్ధి చేయడానికి అనేకమైన విద్యాసంస్థలని ఆ ప్రాంతాలన్నిటా నెలకొల్పినవారు . తమ సంస్థానాన్ని విద్యల నిలయంగా మార్చాలన్నది వారి ఆకాంక్ష . తమ ఆస్తులని చాలా వాటిని ఇందుకోసమే ఆ జమీందారులు వినియోగించినవారు . ఆ ప్రాంతంలో సంగీత సాహిత్యాలు , ఆధునిక విద్యా అత్యంత వేగంగా అభివృద్ధి అయినాయి అంటే పంతొమ్మిదవశతాబ్ది తొలిభాగంలో , అందుకు ఈ ప్రముఖులందరి ఆలోచనలు , వారికి విజయనగరం రాజావారిచ్చిన తోడ్పాటు ఇవన్నీ కారణాలు ! ఆనాటి యువతరం వారంతా ఈ జమీందారుల ఆలోచనా విధానాల వల్ల ప్రేరణపొందినవారే ! కందాళ సుబ్రహ్మణ్య తిలక్ గారు సైతం విద్యార్థి నాయకునిగా ఎదగడం -- ఆతరువాత క్రమంగా దేశంలోని సోషలిస్టు రాజకీయాలవైపు ఆకర్షితులవడం ఇందువలన చాలా సహజంగా జరిగింది మరి .
తిలక్ గారు కూడా కాశీ యూనివర్సిటీ లో చదువుకున్నారు . తరవాత బెల్గాం నించి లా డిగ్రీ చేశారు . తిలక్ గారికి స్వయానా చిన్నాన్న గారైన కందాళ సర్వేశ్వర శాస్త్రి గారు విశాఖపట్నాన ఆనాడు ప్రముఖ న్యాయవాది . ఆయన దగ్గిర అసిస్టెంటు గా చేరితే చాలు ఈ కుర్ర లాయరుకి వృత్తిలో అటు పేరుకి పేరు డబ్బుకి డబ్బూ ఆర్జించడానికి బోలెడంత అవకాశం . అందరు ఆ సలహా చెప్పిన వారే ఆయన కుటుంబంలో ఆనాడు . కానీ తిలక్ గారు మొదటి నించీ ఆర్జనకి వ్యతిరేకి . సొంత ఆస్తికి వ్యతిరేకి . ఆనాటికి ఉడుకురక్తం ఉన్న యువకుడు ఆయన . అందువలన ఆయన పూర్తిగా సోషలిస్టు రాజకీయాలవైపు తన జీవితాన్ని మళ్లించుకున్నారు . ఆ తరువాత ఆయన జీవితం అంతా ఈ దేశంలోని సోషలిస్టు రాజకీయాల చరిత్రతో పెనవేసుకుని నడిచినదే ! ఆచార్య నరేంద్ర దేవ్ , రామ్ మనోహర్ లోహియా , అచ్యుత్ పట్వర్ధన్ , మధులిమాయె , కృపలానీ , మధు దండావతే , మినూ మసానీ , అశోక్ మెహతా , యూసుఫ్ దేశాయ్ లాంటి వ్యక్తులు ఆ నాడు సోషలిస్టు పార్టీలో పనిచేసినవారు . ఆకులపురుషోత్తం విశాఖలో సోషలిస్టు పార్టీ ని నడిపిన వ్యక్తి . దేశానికి ఇంకా స్వాతంత్య్రం రాకముందటి కాలం అది . అలాంటి రాజకీయవాతావరణపు ప్రభావం మా తిలక్ గారి మీద ఉంది . ఆయన స్టూడెంట్ నాయకునిగా ఉన్నప్పుడే అరెస్ట్ అయి జైలుకి వెళ్లిన వారు .
ఇలాంటి తిలక్ గారిని ఆహ్వానించి , రైల్వేబోర్డు ని ఒకదానిని ఏర్పాటు చేసి దానికి తిలక్ గారిని చైర్మన్ ని చేశారు , మధుదండావతే ! ఆయన జనతాదళ్ గవర్నమెంటు లో రేల్వే మినిస్టర్ గా ఉన్నప్పుడు ! తిలక్ గారు అధికార వ్యవస్థకి నిజానికి వ్యతిరేకం . అధికారం అన్నది మనిషిని అహంకారిని చేస్తుంది అన్నది ఆయన విశ్వాసం . అందరూ నచ్చచెప్పి , మధు దండావతే మరీ మరీ రమ్మంటూ తనని పిలిచేక , ఆయన సికింద్రాబాద్ రైల్వే బోర్డు కి చైర్మన్ గా ఒక రెండేళ్లు కాబోలు పనిచేశారు . రైల్వే ఉద్యోగానియామకాలు ఆయన ఆధ్వర్యంలో పరమ నిక్కచ్చిగా జరిగేవి . ఉద్యోగాలకోసం అని వచ్చి , డబ్బులు లంచం ఇస్తే ఉద్యోగాలు రావొచ్చునన్న ఊహతో వచ్చే వారికి , ఆయన నాయకత్వపు కాలం చాలా నిరాశని మిగిల్చింది . అలాంటి వారికి ఆయన కౌన్సిలింగ్ చేసి తిరిగి పంపేవారు . ఆ సమయంలో ఆయన చిన్నకూతురు కూడా రైల్వే పరీక్ష రాసింది , కానీ ఆమె అందులో ఉత్తీర్ణం అవలేదు . ఆ అమ్మాయికి కావాలంటే ఆయన స్థానంలో ఇంకా ఎవరైనా ఉంటె చాలా సునాయాసంగా ఒక ఉద్యోగాన్ని వేయించుకోగలరు . కానీ ఆయన అలాంటిపని చేయలేదు . ఈయన ఆదర్శాలకు కుటుంబంలోని ఇతరులకీ ఇలా అనేకసార్లు సంఘర్షణ వచ్చిన సందర్భాలు సహజంగానే ఉండేవి ! అయినా ఆయన తన వైఖరితోనే తలవొంచక బతికిన వ్యక్తి చివరిదాకా ! మిఠాయిల పుల్లారెడ్డి గారు తిలక్ గారిని పిలిచి తాము నిర్వహించే ఒయాసిస్ పబ్లిక్ స్కూల్ నిర్వహణ బాధ్యతని తీసుకోమని అన్నారు . తిలక్ గారు తన ఆదర్శనాలని చెప్పి చేరారు . కానీ అక్కడ తనకి నప్పక కొన్నాళ్ళు పనిచేసి మళ్ళీ అక్కడినించి వైదొలిగారు . కొన్నాళ్ళు భాగవతుల చారిటబుల్ ట్రస్ట్ కి ఆయన పనిచేశారు . అక్కడా ఆయన ఇమడలేదు . ఆ ఆతరవాత " స్పందన " అన్న సంస్థని తానే నెలకొల్పారు . తూర్పు గోదావరి ఏజెన్సీ ప్రాంతంలో . .. ఆదివాసీల పిల్లల కోసం అని . అక్కడే వారికి భోజనం ఏర్పాట్లు ఉండేవి . ఆ కొండజాతుల పిల్లలంతా ఈయన ని తాతగారూ ! అని పిలిచేవారు . ఆయన " స్పందన " ని చూడడానికి అని నేను వెళ్లాను .
స్ఫురద్రూపి , అందగాడూ తిలక్ గారు . . ఆయన పుట్టిన కొన్ని నెలలకే కన్నతల్లి తల్లిపోయింది . సవితి తల్లి తనని ఎంతబాగా చూసుకునేదో ఆయన చాలా ఆర్ద్రంగా చెప్పేవారు . ఆయన భార్య కాంతం గారు మూడేళ్లకిందట [ 2015 లో ] కన్నుమూసేరు . ఆఖరిరోజుల్లో ఆవిడకి అన్నీ తానే అయి తిలక్ గారు సేవ చేసినవారు . ఆయన చాలా సంప్రదాయ బద్ధమైన మా బ్రాహ్మణ కుటుంబంలోనే పుట్టినా -- ఒక్కనాడు ఆ వర్గానికి సంబంధించిన ఒక్క నమ్మకం గాని , ఒక్క చాదస్తంగాని ఏనాడూ అనుసరించిన వారు కారు . ఆయన సోషలిస్టు రాజకీయమే ఆయన జీవితం కూడా ! అరవై సంవత్సరాల వయసులో ఒక నవయువకునికి ఉండే ఉత్సాహం ఉద్రేకం ఆయనకీ వ్యవస్థ బాగోగుల విషయంలో ఉండేవి . ఆయన జ్ఞాపకం మహా గాఢమైనది . చిట్టచివరి వరకు ఆయన నోట సోషలిస్టు రాజకీయాలు , దేశ స్వాతంత్య్ర పు ముందటి పరిస్థితుల నించి , దేశ స్వాతంత్య్రపు పిమ్మటి స్థితిగతులు , అందులోని లోటుపాట్లు వీటిని గురించిన విశ్లేషణ చాలా చురుకుగా ఉండేది . ఆయన కాంగ్రెస్ కి వ్యతిరేకంగా మాట్లాడేవారు , అలాగే ఆయన ఆయుధ పోరాటం చేసే నక్సలైట్ల పంథాని సైతం ఒప్పేవారు కాదు . కానీ ఆయన దగ్గరికి ఆ కొండల్లో పనిచేసేటప్పుడు నక్సలైట్లు వచ్చి మాట్లాడి వెడుతూ ఉండేవారు ఆ ఏజెన్సీ ప్రాంతంలో ఆయన " స్పందన " సంస్థని నడిపినప్పుడు . చాలా అనర్గళంగా ఉపన్యాసాలని పైగా అర్ధవంతంగా మాట్లాడగల్గిన వక్త తిలక్ గారు .
వెంపల్లి [ సిరిపూర్ కాగజ్ నగర్ కి దగ్గరగా ఉన్న అటవీ ప్రాంతం ] లాంటి వూళ్ళో మగ్గుతూ ఉండే మమ్మల్ని సికింద్రాబాద్ కి ట్రాన్స్ఫర్ చేయడానికి ఆయన సహాయం కోసం అని కలిసాను నేను ఆయనని 1979 లో , ఆయన రైల్వే బోర్డు చైర్మన్ గా ఉన్నప్పుడు . నేనెవరో ఆయనకీ తెలీదు . ఆయన నాకూ తెలియదు . మిత్రులు చెప్పేరు ఒకసారి అడిగి చూడు . ఆయన చెప్తే ట్రాన్స్ఫర్ ఈ సిటీకి అవొచ్చును అని . నేను ఆనాడు మొదటిసారి ఆయన చూసినప్పటి ఆ క్షణం నాకు ఇంకా గుర్తుంది . ఆయన నేను ఎవరో తెలియకున్నా నా అభ్యర్ధన ని విని సానుకూలంగా స్పందించారు . అలా నేను 1980 లో ఉస్మానియా యూనివర్సిటీలో చేరి నా
చదువులని అన్నిటినీ కొనసాగించగలిగేను . . అలాగే విశ్వనాధ సూర్య నారాయణ కూడా ఉస్మానియా లా కాలేజీ లో చేరి లా డిగ్రీని సాధించేడు . అలా నా చదువులు నిరాటంకంగా కొనసాగడానికి తిలక్ గారు కారకులు ఇలా !
తిలక్ గారి ఆకర్షణ బలమైనది . కుర్రవాళ్ళని ఆయన గభాల్న ఆకట్టుకునేవారు . వాళ్ళ సామాజిక దృక్పధాన్ని ఆయన గాఢంగా ప్రభావితం చేసేవారు . ఆదర్శవాది ఆయన . చివరికంటా తన ఆదర్శాలని నిలుపుకుంటూనే బతికేరు . అత్యంత విద్యాధికుడై ఆయన సొంతానికి ఏమీ సంపాదించుకోలేదు . వావిలాల గోపాల కృష్ణయ్య గారిలాగానే ! ఈయన వైఖరి కుటుంబానికీ మరీ ముఖ్యంగా ఆయన భార్యకి అర్ధం అయ్యేది కాదు . నప్పేదీ కాదు . అయినా కట్టుకున్నవాడు అనీను , వెనకటికాలం ఇల్లాలు గనక నచ్చినా నచ్చకున్నా ఆవిడ అంచేత భర్తని అనుసరించేది అంతే ! ఆవిడ మెడలో మంగళ సూత్రాలు ఉండేవి కావు . నల్లపూసలూ ఉండేవి కావు . మా అమ్మా నాన్న గారల తరానికి చెందిన వారు కదా ? అంచేత నాకు చాలా థ్రిల్ గా ఉండేది ఆయన చూపే ఆ ఆదర్శం అన్నా ... ఆయన లోని ఆ తిరుగుబాటు ధోరణి అన్నా ! నన్ను ఎప్పుడూ " మా అమ్మాయి " అనే అనేవారాయన . నేను కూడా ఆయనని " నాన్నగారూ ! " అనే పిలిచేదాన్ని ! అలా తండ్రి కూతుళ్ళ అనుబంధంగా గడిచింది ఆనాటి కాలం !
క్రమేపీ నేను నా బతుకులో నా రాతకోతల్లో నా మార్గంలో బిజీ అయిపొయేను . నేను విశాఖపట్నానికి ఏమంతగా వెళ్ళలేదు . ఏవో వారి నోటా వీరి నోటా తిలక్ గారిని గురించిన కబుర్లు వినడమే తప్ప -- తొంభై దశకం దాకా కొన్ని ఉత్తర ప్రత్యుత్తరాలుగా కొనసాగినా -- చివరికి ఆయన తో నా సంభాషణ ఆగిపోయింది కొన్నాళ్ళకి . 2009 లో ఆయన పెద్ద అల్లుడు చాగంటి విజయకుమార్ కనిపిస్తే నా అన్నమయ్య పద ఆవిష్కరణ సభలో -- తిలక్ గారు ఎలా ఉన్నారు ? ఏమిటీ ? అని విజయ్ కుమార్ ని అడిగి కనుక్కున్నాను . ఆ ఆతరవాత నాకు మరి ఆయన ని గురించి తెలిసిందే లేదు . నిన్న మా చిన్నక్క ఫోను చేసి " ప్రభా ! నీకు తెలిసిందా ? తిలక్ గారు పోయేరుట " అన్న వార్త చెప్పిన దాకా ! సన్నని విషాదం నా మనసుని కమ్మింది గానీ -- పూర్ణాయుర్దాయాన్ని పొంది 98 సంవత్సరాల వయసులో మరి వెళ్లిపోవడం అన్నది కాల ధర్మమే కదా ! ఈ దేశంలో కళింగాంధ్రమ్ నించి చెప్పుకోవలసిన ముఖ్య సోషలిస్టు నాయకుడైన శ్రీ కందాళ సుబ్రహ్మణ్య తిలక్ స్మృతికి , ఇది నా నివాళి !
జయప్రభ
09-06- 2018

Comments
Post a Comment